

గ్రామీణ రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం, మట్టి ఆరోగ్యాన్ని పరిరక్షించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (NMNF) పథకం పై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈరోజు రైతుల అవగాహన సమావేశం తిమ్మారెడ్డి గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సహజ వనరుల ఆధారిత వ్యవసాయం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. ముఖ్యంగా సహజ వ్యవసాయ విధానాలు, జీవామృతం మరియు ఘనజీవామృతం తయారీ విధానాలు, దేశీ ఆవుల ప్రాముఖ్యత, మట్టిలో సూక్ష్మజీవుల పాత్ర, పంట వ్యయాలు తగ్గించి లాభాలు పెంచుకునే మార్గాలు వంటి అంశాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ఎంఏఓ ఎల్లారెడ్డి అనిల్ కుమార్, సైంటిస్ట్ రేవంత్ నాథన్ ,ఏఈఓ రాజా గౌడ్, గ్రామ సర్పంచ్ అనసూయ గంగారెడ్డి, తిమ్మారెడ్డి తాండ సర్పంచ్ కోలా రాములు నాయక్ , తిమ్మారెడ్డి ఉప సర్పంచ్ గంగమని శ్యామ్ రావు, కృషి సఖీలు, మాజీ సర్పంచులు కృష్ణారెడ్డి, వసంతం, మహమ్మద్ అలీ, మరియు గ్రామ రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, సహజ వ్యవసాయం ద్వారా రైతులు తక్కువ వ్యయంతో స్థిరమైన ఆదాయం సాధించవచ్చని, అలాగే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన మట్టిని అందించవచ్చని తెలిపారు.